‘స్త్రీ శక్తి’తో మహిళలకు ఆర్థిక చేయూత

స్త్రీ శక్తి’తో మహిళలకు ఆర్థిక చేయూత

 

  • అన్నగా నేను ఆడబిడ్డలకు ఇస్తున్న వరం ఉచిత బస్సు ప్రయాణం
  • చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ మహిళలకు ఫ్రీ సర్వీస్
  • రాష్ట్రంలోని 2.62 కోట్ల మహిళలకు లబ్ధి కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఏడాదికి రూ.1,942 కోట్లు
  • ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తాం
  • ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం
  • రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్థులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • స్త్రీ శక్తి పథకం ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  • ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులో సీఎం ప్రయాణం
  • సీఎంతో కలిసి బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్

 

అక్షర ఉదయమ్ – విజయవాడ

స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర్యం దినోత్సవం రోజున ఈ స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించామన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు వారి గౌరవాన్ని పెంచడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీల్లో ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి పథకాన్ని ఉండవల్లి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, బీజేపీ ఏపీ అధియక్షుడు మాధవ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్‌ను అందించారు. ఉండవల్లి నుంచి మహిళలతో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ వరకు ప్రయాణించారు. దారి పొడవునా వివిధ బస్ స్టాప్ లలో ప్రజలు, ప్రత్యేకించి మహిళలు స్వాగతం పలికారు. బస్సుల్లో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లతో కరచాలనం చేసేందుకు బస్ వెంబడి పరుగులు పెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్నంత సేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళలతో మాట్లాడారు. వాళ్ల స్థితిగతులతో పాటు.. ఉచిత బస్ ప్రయాణం వల్ల ఎంత వరకు మేలు కలుగుతుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ బస్టాండ్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం

‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కొన్ని సీట్లు రిజర్వ్ విధానం చేశాం. ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాను. ఇకపై ప్రతి ఆడబిడ్డ ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు. మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాను. దారి పొడవునా పలువురు మహిళలతో మాట్లాడాను. వారి మాటలు విన్న తర్వాత ఆడబిడ్డలకు మంచి చేశామన్న తృప్తి కలిగింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

అన్నగా ఇస్తున్న వరం

‘ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు అన్నగా నేను ఇస్తున్న వరం. రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ పథకం అమలుకు నెలకు రూ.162 కోట్లు, ఏడాదికిరూ.1,942 కోట్లు వ్యయం చేస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డనరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రస్తుతం 11,449 బస్సులు నిర్వహిస్తుండగా అందులో మహిళలు 8,458 బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించాం. స్త్రీ శక్తి పథకం ద్వారా 74 శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ప్రతీ తల్లీ అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి రావొచ్చు. ప్రతీ కోడలూ, అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్‌కు వెళ్లి రావొచ్చు. ప్రతి మహిళా, ప్రతి యువతీ ఉద్యోగానికి, విధులకు ఛార్జీ లేకుండా వెళ్లవచ్చు. వృద్దులు హాయిగా దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. చిరు వ్యాపారులు వారి ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి మంచి ధరకు అమ్ముకోవచ్చు. నరేగా పనులకు, కూలీ పనులకు వెళ్లే మహిళలు తమ ఉపాధి కోసం ఉచిత ప్రయాణం చేసి డబ్బు ఆదా చేయొచ్చు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా

‘ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ఉపాధి కోసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు వెళ్లి వ్యాపారం చేసుకునే మహిళలకు ఈ పథకం ఎంతో అండగా ఉంటుంది. ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్లే వారికి పథకం నిజమైన ఆర్ధిక శక్తిగా ఉంటుంది. బస్సులో ప్రయాణించే మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, టిక్కెట్ ధర ఎంత? రాయితీ ఎంత ఇస్తున్నామనే వివరాలతో టిక్కెట్ ఇస్తారు. టిక్కెట్ ధర ఎంత ఉన్నా 100 శాతం రాయితీ కల్పిస్తున్నాం. ఈ పోస్ మిషన్ ద్వారా మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ వస్తుంది. మీ ప్రయాణ వివరాలు తెలిపేందుకే మాత్రమే ఈ టిక్కెట్ ఇస్తున్నాం. బస్సులో ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు’ అని సీఎం స్పష్టం చేశారు.

డోర్ పికప్ సర్వీసులు పెంపు

‘ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఆర్టీసీ సామర్ధ్యాన్ని పెంచుతున్నాం. రాష్ట్రంలోని 129 డిపోలు, 423 బస్ స్టేషన్లు, 4 జోనల్ వర్క్‌షాపులు… ఇలా మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇకపై బస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి గమ్యం చేరేవరకు బ్రేక్‌డౌన్‌లు తలెత్తవు. స్త్రీశక్తి అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుని, దానికి తగ్గట్టు పథకాన్ని మెరుగుపరుస్తాం. బస్ స్టేషన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచుతున్నాం. పీఎం-ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నాం. పార్సిల్ సర్వీస్ ద్వారా అధిక ఆదాయం తెస్తున్నాం. డోర్ డెలివరీ, డోర్ పికప్ సర్వీసులు పెంచుతాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఒత్తిడి ఉన్నా… అతిధుల్లా చూడండి

‘మహిళా భద్రత దృష్ట్యా ప్రతీ బస్సులో జీపీఎస్ అమర్చాం. బస్సు ఏ రూట్లో ఎటు వెళ్తుంది అనేది రియల్ టైమ్ ట్రాక్ చేస్తాం. ఇకపై ఏ బస్సు కొన్నా ఎలక్ట్రికల్ బస్సులే, ఏసీ బస్సులే కొంటాం. ఆర్టీసీకి ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తాం. ఈ సందర్భంగా ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లను, కండక్టర్లను ఉద్యోగులను, అధికారులను నేను ఒకటే కోరుతున్నాను. కొత్త పథకాల అమలు సమయంలో ఉద్యోగులపైనా కొంత ఒత్తిడి ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా మహిళలను అతిథుల్లా చూడాలి’ అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఇక్కడున్నది 1995 నాటి సీబీఎన్

‘నేను ఏ పని తలపెట్టినా యజ్ఞంలా చేస్తున్నాను. కానీ కొందరు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే రాజకీయ లబ్ధి కోసం విషం చిమ్ముతున్నారు. అమరావతిని స్మశానం, ఎడారి అన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం. మీకు అండగా ఉండే ప్రభుత్వం. ఇటీవల పులివెందులలో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. 30 ఏళ్ల తర్వాత ఓటేశాను, అందరికీ దండాలు అని బ్యాలెట్‌లో ఓ వ్యక్తి రాశాడు. అంటే వారికి 30 ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మా వివేకా సార్‌కు న్యాయం చేయండని మరో వ్యక్తి కోరుతూ బ్యాలెట్‌లో స్లిప్ రాసి వేశారు. కొందరు కరుడు కట్టిన నేరస్థులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వాటి ఆటలు సాగనివ్వను. ఇక్కడున్నది 2025 సీఎం కాదు… 1995 నాటి సీఎం’ చంద్రబాబు హెచ్చరించారు.

మహిళాభ్యున్నతికి తొలి ప్రాధాన్యత

ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఆడబిడ్డలు చదువుకోవాలని తిరుపతిలో మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నేను రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాను. మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించడం కోసం డ్వాక్రా తెచ్చాను. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను పెట్టాం. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళలను పెడతాం. నేనెప్పుడూ మహిళా సాధికారతను కోరుకుంటాను. 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎంఎస్ఎంఈలతో మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తున్నాం. రాబోయే రోజుల్లో డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తాం. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఈగల్ వ్యవస్థ తెచ్చి గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలకు అడ్డుకట్ట వేశాం. ఇంట్లో మహిళలను అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో నాకూ, మిత్రుడు పవన్ కల్యాణ్‌కు తెలుసు. మహిళలను ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

ఈ నెలాఖరుకు డీఎస్సీ పోస్టులు భర్తీ

‘64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి రూ.33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గత పాలకులకు రూ.2,000 పింఛను రూ.3000 చేయడానికి ఐదేళ్లు పట్టింది. తల్లికి వందనం పథకంతో రూ.10 వేల కోట్లతో ఒక్కో విద్యార్ధికి రూ.15,000 చొప్పున 67 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించాం. కట్టెల పొయ్యి దగ్గర నా తల్లి పడిన కష్టం మరే ఆడబిడ్డ పడకూడదని దీపం పథకం తెచ్చాను. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈ ఆగస్టు నెలాఖరుకు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. గత ఐదేళ్లు ప్రజలను వేధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. 204 అన్నా క్యాంటిన్ల ద్వారా 5.16 కోట్ల మందికి రూ.5 లకే కడుపు నింపాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

 

 

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in