అక్షర ఉదయమ్
Date of Publish : 21 May 2025, 7:16 pm Posted by : అక్షర ఉదయమ్

ఇకపై రేషన్ షాప్‌ల ద్వారానే బియ్యం, సరుకుల పంపిణీ

ఇకపై రేషన్ షాప్‌ల ద్వారానే బియ్యం, సరుకుల పంపిణీ

– ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

– వారికి మినహాయింపు

 


అక్షర ఉదయమ్ – గుంటూరు

రేషన్ పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా జరుగుతుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందుతుందని ఆయన తెలిపారు.

మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చింది. మంత్రి వర్గ సమావేశం తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇక రేషన్ వ్యాన్‌లతో సరుకుల సరఫరా ఉండదని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి గతంలో మాదిరిగానే రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా జరుగుతుందని ఆయన అన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందుతుందని తెలిపారు.

అయితే 29 వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా సజావుగా జరిగేదని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల పేరిట ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం రూ.1860 కోట్లు డబ్బు వృధా చేశారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానంతో రేషన్ లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక పోయారని తెలిపారు. ఈ విధానం ద్వారా సుమారు 30 శాతం లబ్ధి దారులకు రేషన్ అందట్లేదని ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలో తేలిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ వాహనాలతో రేషన్ సరఫరా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జవాబుదారీ తనం లేకుండా పోయిందని, సరుకులు ఎటు పోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ వాహనాలతో బియ్యం అక్రమ రవాణాకు పాల్పడడంతో వారిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు అయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 29 వేల రేషన్ షాపుల ఉంటే.. కేవలం తొమ్మది వేల వాహనాలే ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. దొంగ లెక్కలు చూపి బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. అందుకే వీటికి చెక్‌ పెట్టే విధంగా ముందులాగే రేషన్ దుకాణాల ద్వారా సరుకులు సరఫరా చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరుకులు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..