అక్షర ఉదయమ్
Date of Publish : 13 April 2025, 1:41 am Posted by : అక్షర ఉదయమ్

తిరుమలలో అపచారం

తిరుమలలో అపచారం

  • చెప్పులతో శ్రీవారి దర్శనానికి భక్తులు
  • టీటీడీ ని కుదిపేసిన ఘటన

 

అక్షర ఉదయమ్ – తిరుమల

 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విస్తృతంగా భద్రతా చర్యలు తీసుకుంటోంది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మరియు SED (Special Entry Darshan) కాంప్లెక్స్‌ల ద్వారా భక్తులకు క్రమబద్ధమైన దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. మొదట లైట్ సెక్యురిటి చెక్ జరిపి, తర్వాత ఎలిఫెంట్ గేట్ వద్ద క్షుణ్ణ తనిఖీలు చేపడతారు. అంతేగాక, మహా ద్వారానికి ముందు మరో చిన్న చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది.

అయితే, శనివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సమయంలో భక్తుల మధ్యలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కొందరు భక్తులు ఇంట్లో వేసుకునే మెత్తటి స్లిప్పర్లు వేసుకుని దర్శనానికి వచ్చారు. మొదట సిబ్బంది వాటిని “సాక్స్”గా భావించినప్పటికీ, దగ్గరగా చూసిన తర్వాత అవి సాఫ్ట్ ఫోమ్ స్లిప్పర్లు అనే విషయం తెలిసింది. వెంటనే టీటీడీ సిబ్బంది వారిని ఆ చెప్పులు తొలగించాలని కోరారు.

ఈ సంఘటన టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఒక హెచ్చరికగా మారింది. భద్రతా సిబ్బంది రెండు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ పొరపాటు ఎలాగైనా జరిగింది. భక్తుల భద్రత, ఆలయ పవిత్రత విషయంలో జాగ్రత్తలు మరింత కఠినంగా తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా, ప్రతి చెక్‌పాయింట్‌లో కూడా శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది.