అక్షర ఉదయమ్
Date of Publish : 06 March 2025, 4:03 pm Posted by : అక్షర ఉదయమ్

పవన్ కళ్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే యరపతినేని

పవన్ కళ్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన యరపతినేని

– ఇంకా తాను అధికారంలో ఉన్నాననే భ్రమలోనే జగన్

– గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎదుటి వ్యక్తిని గౌరవించ లేని జగన్మోహన్ రెడ్డి, అధికారం, అహంకారంతో విర్రవీగి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా గానీ, ఎదుటి మనిషిని ఇప్పటికీ గౌరవించే విధానంలో ఎక్కడా కూడా మార్పు రాలేదని యరపతినేని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా తాను అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వైసిపి అధికారంలో ఉండగా అవినీతి, అక్రమాలు, అహంకారంతో విర్ర వీగటమే కాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని,పవన్ కళ్యాణ్ ని, వారి కుటుంబ సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించి వేయడమే కాకుండా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదని విమర్శించారు.

డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో ప్రముఖమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగజారుడు తనం అని అభిప్రాయ పడ్డారు. తల్లిని, చెల్లిని బజారుకు ఈడ్చి, సాంప్రదాయాలను, కుటుంబ సభ్యులనే గౌరవించ లేని వ్యక్తి, ఇంకా ఎదుటి వ్యక్తులను ఎలా గౌరవిస్తారని అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. జగన్ లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచి వెలి వెయ్యాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కోరారు .