అక్షర ఉదయమ్
Date of Publish : 02 February 2025, 3:45 pm Posted by : అక్షర ఉదయమ్

రాష్ట్రపతి భవన్‌లో చారిత్రాత్మక వివాహం

అక్షర ఉదయమ్ – ఢిల్లీ

 

– చరిత్రలో తొలిసారి

రాష్ట్రపతి భవన్‌లో చారిత్రాత్మక వివాహం జరగనుంది. తొలిసారిగా రాష్ట్రపతి భవన్‌లో మహిళా ఉద్యోగి పెళ్లి జరగనుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌ఓ)గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవన్‌లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ప్రత్యేక అనుమతిని మంజూరు చేశారు.

 

ఈ నెల 12న రాష్ట్రపతి భవన్‌లోని మదర్‌ థెరిసా క్రౌన్‌ కాంప్లెక్స్‌లో వివాహం జరగనుంది. వధువు పేరు పూర్ణిమా గుప్తా. సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ గా పని చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని శ్రీరామ్ కాలనీకి చెందిన పూర్ణిమ గుప్తా డిగ్రీలో మ్యాథ్స్ చదివింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2018లో ఆమె UPSC CAPF పరీక్షలో 81వ ర్యాంక్ సాధించి, తర్వాత సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆమె వృత్తి నైపుణ్యం, ప్రవర్తనతో ముగ్ధులైన ప్రెసిడెంట్ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఆమె వివాహానికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. అయితే, రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా మహిళా ఉద్యోగి వివాహం జరగడం విశేషంగా మారింది.

సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ అయిన అవనీష్ కుమార్‌ను పూర్ణిమా గుప్తా పెళ్లి చేసుకోనుంది. వారి ఉద్యోగ ప్రాముఖ్యత దృష్ట్యా, రాష్ట్రపతి భవన్‌లో వీరి వివాహానికి ముర్ము అనుమతిని మంజూరు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, వివాహానికి కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించారు.