మున్సిపల్ కార్మికులకు రూ. కోటి బీమా

మున్సిపల్ కార్మికులకు రూ. కోటి బీమా

 

  • అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత మున్సిపాలిటీలు
  • ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ ఓ విషవృక్షం
  • వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్
  • మునిగింది అమరావతి కాదు.. వైసీపీ
  • దివ్యాంగ పింఛన్లపై అపోహలొద్దు అర్హులందరికీ ఇస్తాం
  • స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సభలో 10 వైసీపీ కుట్రలను ఏకరువు పెట్టిన ముఖ్యమంత్రి

 

అక్షర ఉదయమ్ – పెద్దాపురం

 

ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి ఆరోగ్యాలను పణంగా పెడుతున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త వేతన అకౌంట్ల ద్వారా రాష్ట్రంలో పని చేస్తున్న 55,686 మంది కార్మికులకు అదనపు ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు. ప్రమాదవశాత్తూ మరణించిన రెగ్యులర్ కార్మికులకు రూ.1 కోటి, ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు రూ.20 లక్షల చొప్పున వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందజేస్తామని అన్నారు. శాశ్వత వైకల్యం పొందినా ఇంతే మొత్తాన్ని అందిస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారి పిల్లలకు రూ. 8 లక్షల వరకు విద్యా సాయం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంరద్భంగా స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు.

పరిసరాల శుభ్రత… అందరి బాధ్యత

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో సీఎం మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందే కానీ చెత్తను తొలగించలేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తతో రాష్ట్రాన్ని చెత్తమయం చేశారు. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో నూటికి నూరు శాతం చెత్తను తొలగిస్తాం. గ్రామాలు, పట్టణాలే కాదు.. మన ఆలోచనలూ స్వచ్ఛంగా ఉండాలి. మంచి మనసున్న వ్యక్తులు ఉండే తూర్పుగోదావరి జిల్లాలో కూడా గడిచిన ఐదేళ్లలో రౌడీయిజం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించే ఆలోచన చేస్తున్నాం. చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయడం, ప్లాస్టిక్ నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

పెట్టుబడులు తెస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు

వైసీపీ విష ప్రచారాలు, ఫేక్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే సిద్దాంతంగా వైసీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. గడిచిన 10 ఏళ్లలో జరిగిన విష ప్రచారాలను, వైసీపీ కుట్రలను ప్రజలకు వివరించారు. ‘మేము ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే వైసీపీ విషం చిమ్ముతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి మాపై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధితో ముందుకెళ్తున్నాం. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ… ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రయాణం చేస్తున్నాం. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తుంటే రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకి సృష్టిస్తున్నారు.’ అని ధ్వజమెత్తారు. వైసీపీ చేసిన అత్యంత విష ప్రచారాలైన పది అంశాలను సీఎం వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పార్టీ ఉందో, వాళ్ల క్రిమినల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

1. వివేకా హత్య కేసు: ‘బాబాయి హత్య అనేది దేశంలోనే క్రిమినల్ పాలిటిక్స్‌కు కేస్ స్టడీ… అవునా, కాదా? తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారా లేదా?’

2. కోడి కత్తి డ్రామా: ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు కోడి కత్తి డ్రామా ఆడారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు ఎటుపోయిందో మీరే చూశారు. దీన్ని మిస్టరీగా మార్చారు.’

3. గులకరాయి డ్రామా: ‘సీఎంగా ఉండి గులకరాయితో హత్యాయత్నం అంటూ కట్టు కట్టుకుని ఎన్నికల డ్రామా ఆడారు.’

4. డయాఫ్రమ్ వాల్: ‘అసమర్ధతో, నిర్లక్ష్యంతో, అహంకారంతో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమై… ఆ నెపాన్ని మాపైనే నెట్టారు.’

5. పింఛన్ల నిలిపివేత: ‘2024 ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వొద్దంటే ఏకంగా ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వడమే ఆపేశారు. అక్కడికి రా.. ఇక్కడికి రా.. అంటూ వాళ్ల రాజకీయం కోసం వృద్ధులను ఎర్రటి ఎండలో తిప్పారు. 16 మంది వృద్ధుల ప్రాణాలు తీసి… దానికి చంద్రబాబు కారణం అని సొంత మీడియా ద్వారా ఊదర గొట్టారు.’

6. సింగయ్య మృతి: ‘2024 ఎన్నికల తీర్పు తరువాతా వాళ్లు మారలేదు. పరామర్శల పేరుతో యాత్రలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఉనికి యాత్రల కోసం అమానుషంగా తమ వెహికల్‌తో తొక్కించి సింగయ్య అనే కార్యకర్త ఉసురు తీశారు. వీడియో బయటపడే వరకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని దాచిపెట్టారు. వీడియో బయటిక వచ్చాక.. సింగయ్య భార్యను ప్రలోభపెట్టి… అంబులెన్సులో చంపేశారని మన పైనే విమర్శలు చేయించారంటే వాళ్లు ఏ స్థాయి క్రిమినల్స్ అనేది అర్ధం చేసుకోవాలి.’

7. వీడియో మార్ఫింగ్: ‘జనం తన కోసం ఎగబడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నెల్లూరు పర్యటనలో బంగారుపాళ్యం జనాన్ని చూపించి మిక్స్ చేసి చూపించారు.’

8. మునిగింది రాజధాని కాదు…వైసీపీ: ‘రాజధాని అమరావతిపై ఎప్పుడూ విషం కక్కే వైసీపీ… అమరావతి మునిగింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. అమరావతిపై విషం చిమ్మాలనే ప్రయత్నంలో రాష్ట్ర బ్రాండ్ ను కూడా దెబ్బ తీస్తున్నారు. రాజధాని మునగలేదు… విష ప్రచారంలో వైసీపీ మునిగింది. రాజకీయంగాను పూర్తిగా మునిగిపోతుంది.’

9. పెట్టుబడులు వద్దంటూ లేఖలు: ‘తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కంపెనీలను వెళ్లగొట్టిన వైసీపీ పాలకులు… ప్రతిపక్షంలోనూ కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా సంస్థలకు లేఖలు రాస్తున్నారు.’

10. పింఛన్లపై తప్పుడు ప్రచారాలు: ‘ఇప్పుడు మళ్లీ పింఛన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల హయాంలో వేలు, లక్షల మంది అనర్హులకు, పార్టీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వీటిపై వెరిఫికేషన్ జరుగుతుంటే… 4 లక్షల పింఛన్లు తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్క పింఛను కూడా ఇప్పటికి తీయలేదు. అర్హులైన వారి ఏ ఒక్క పింఛను కూడా తీసేది లేదు. అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు ఇప్పించారు. అనర్హులకు ఫించన్లు ఇచ్చి.. అర్హులను వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అలా చేయదు. అనర్హులను పక్కన పెడుతుంది.. అర్హులకు పింఛన్లు ఇస్తుంది.’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఏపీలో బొమ్మాళీ భూతం…

ఈ సందర్భంగా అరుంధతి సినిమా గుర్తుందా అంటూ ముఖ్యమంత్రి సభికులను అడిగారు. సభికుల నుంచి వదల బొమ్మాళీ అంటూ సమాధానం వచ్చింది. దీంతో మీరే ఆ విషయం చెప్పండంటూ ముఖ్యమంత్రి సభికులకే మైక్ ఇచ్చారు. వదల బొమ్మాళీ.. వదల అంటూ అరుంధతి సినిమాలో పశుపతి పాత్రధారి చెప్పిన డైలాగును సభికులు చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. అలాంటి భూతం మళ్లీ దుష్ప్రచారం చేస్తూ వస్తోందని.. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని సీఎం చెప్పారు. పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తాం.. ఏదైనా ఊరిలో పరిస్థితులు సరిగా లేకుంటే ఆ ఊరిలో ఉండేవారికి పిల్లను ఇచ్చేందుకు వెనుకాడతాం.. అలాగే ఓటు వేసేటప్పుడు కూడా మంచి, చెడు ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

మనది విజన్ రాజకీయం… వైసీపీది క్రిమినల్ రాజకీయం

ఈ క్రమంలో వైసీపీ తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా ఎండగట్టారు. ‘వైసీపీ చేసేవన్నీ నీచ రాజకీయాలే. మనది అభివృద్ది రాజకీయం. వైసీపీది రాష్ట్రానికి అనర్థం రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం… వాళ్లది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం అయితే వైసీపీది క్రిమినల్ రాజకీయం. తప్పుడు పోస్టు సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని తీసుకుని సాక్షి, ఇతర బ్లూ మీడియా ప్రచారం చేయడమే వైసీపీ రాజకీయం. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదు. నా రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి రాజకీయ పార్టీని చూడలేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా సొంత టీవీ ఛానల్, పేపర్ ఉన్నాయా..? తప్పుడు వార్తలు వేయడానికి పేపర్, టీవీ పెట్టుకున్నారు. నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. మహిళలపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాకపోవడంతో బయట తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ విషవృక్షం లాంటి పార్టీ. నేరాలు, ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించలేరని వారు గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలిజంపై పోరాడాను, సీమలో ఫ్యాక్షన్ మాట వినపడకుండా చేశారు. నా దగ్గర వారి ఆటలు సాగనివ్వను’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

దోమల పై దండయాత్ర అంటే ఎగతాళి చేశారు

వర్షాలకు సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయని సీఎం చెప్పారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా ముప్పు తలెత్తుతోందని అన్నారు. ‘లక్షల రూపాయిలు వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. నేను 2014-19లో దోమలపై యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. కానీ గత ప్రభుత్వం ప్రజారోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యం వహించింది. కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేదు. అప్పులు చేసి సంక్షేమం ఇస్తే దీర్ఘకాల ప్రయోజనాలు ఉండవు. సంపద సృష్టితోనే సంక్షేమం సాధ్యమవుతుంది. సాధ్యమా అని అనుకున్న సూపర్ సిక్స్ హామీలు సాధ్యం చేసి చూపించాం. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నాం. బీజేపీ, జనసేనతో కలిసి ఓవైపు రాష్ట్ర పునర్నిర్మాణం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిస్తున్నాం. ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశాం. ప్రతి నెలా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఆగస్టు 2వ అన్నదాత సుఖీభవకు శ్రీకారం చుట్టి మొదట విడతగా రూ.7,000 ఖాతాల్లో వేశాం. ఈ నెల 7వ తేదీన నేతన్నలకు అండగా నిలిచేలా… మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. త్వరలో నేతన్న భరోసా పేరుతో ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటించాం. నాయీ బ్రాహ్మణలకు లబ్ది చేకూరేలా… సెలూన్లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రారంభించాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

స్త్రీ శక్తి సూపర్ హిట్

ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, ఉచిత బస్సు అంటే కొందరు ఎగతాళి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ ఆచరణలో చేసి చూపించామని తెలిపారు. ‘ఇప్పటివరకూ కోటి మంది మహిళలు ఉచిత బస్సు ద్వారా ప్రయాణం చేశారు. 19వ తేదీన నాకెంతో ఇష్టమైన పీ4ను క్షేత్ర స్థాయిలో అమలును ప్రారంభించాం. 21వ తేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించాం. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. రాష్ట్రంలో పేదరికం అనే మాట వినపడకూడదని పని చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి

పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తన నియోజకవర్గం కోసం ఏది అడిగినా కాదనకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే అడిగిన దానికంటే ఎక్కువే చేస్తానని అన్నారు. ‘పెద్దాపురం, సామర్లకోటలో ఇంటింటికీ కుళాయి కోసం రూ. 75 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. అమృత పథకం కింద నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తాం. పెద్దాపురంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంతో పాటు డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తాం. పెద్దాపురంలో 15 మెగావాట్ల సామర్థ్యంతో రూ. 330 కోట్లతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. దీన్ని 18 నెలల్లో పూర్తి చేస్తాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, కాకినాడ ఎంపీ ఉదయ్, స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సహా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాభి, మున్సిపల్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in