పుష్ప గుచ్ఛాలకు బదులు పుస్తకాలు
- పల్నాడు జిల్లా అధికారుల ఆదర్శవంతమైన నూతన సంవత్సర వేడుకలు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఇచ్చిన పిలుపు సాకారమైంది. ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు పుష్ప గుచ్ఛాలకు బదులుగా పుస్తకాలను బహుకరించాలని ఆమె కోరగా, జిల్లా అధికారులు ఆ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ శుక్లాకి పుస్తకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 1300 నోటు పుస్తకాలు, డిక్షనరీలు, పెద్దబాల శిక్షలు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉపయోగ పడే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్ను కలెక్టర్కు అందజేశారు.
విద్యార్థులకు చేరనున్న జ్ఞాన నిధి
అధికారుల నుంచి అందిన ఈ పుస్తకాలను సద్వినియోగం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వీటిని వివిధ ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. “పుష్ప గుచ్ఛాలు కొద్ది సేపటికే వాడిపోతాయి, కానీ పుస్తకాలు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతాయి. ఈ సంప్రదాయం విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తుంది.” అని కలెక్టర్ కృతిక శుక్లా ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.
పర్యావరణానికి మేలు చేస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.