ఎస్ ఎల్ బి సి టన్నెల్‌లోకి ‘ఆక్వా ఐ’ పరికరాన్ని పంపించిన నేవీ 

అక్షర ఉదయమ్ – నాగర్ కర్నూలు

 

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని గుర్తించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నేవీ బృందం “ఆక్వా ఐ” పరికరాన్ని టన్నెల్‌లో ప్రవేశపెట్టింది.

గత మూడు రోజులుగా సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

అయితే, టన్నెల్ లోపల నాలుగైదు అడుగుల మేర బురద, నీరు ఉన్న కారణంగా, బాధితుల వద్దకు చేరుకోవడం కష్టంగా మారింది.

నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో SLBC టన్నెల్ లోపల, 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషిన్ తో పనులు కొనసాగుతుండగా, అకస్మాత్తుగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది.

 

 

సొరంగంలో చిక్కుపోయిన  8 మంది ఇంజినీర్లు, కార్మికులు

ఆ సమయంలో సుమారు 50 మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా, బోరింగ్ మెషీన్ అవతల ఉన్న 42 మంది రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు పరిగెత్తి,ఆపై లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ ప్రవేశ ద్వారం చేరుకుని ప్రాణాలను రక్షించుకున్నారు.

అయితే, టన్నెల్ బోరింగ్ మెషిన్ లోపలి వైపున ఉన్న మొత్తం 8 మంది ఇంజినీర్లు, కార్మికులు మాత్రం సొరంగంలో చిక్కుకుపోయారు.

వారిని రక్షించేందుకు మొత్తం 9 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు నేవీ, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

టన్నెల్ లోపల నీరు, బురద పేరుకు పోవడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రమాదకరమైన విధానంగా భావించబడే “ర్యాట్ హోల్ మైనింగ్” విధానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.

సాధారణంగా బొగ్గు గనుల్లో ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఇందులో సన్నని, సమాంతర మార్గాలను ఏర్పాటు చేసి, గనులలో లోతుగా ప్రవేశించి బొగ్గును వెలికి తీయడం జరుగుతుంది.

ఈ పద్ధతిలో ప్రధాన సవాలు ఏమిటంటే, తవ్విన మార్గాలు కేవలం నాలుగు అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో, ఒకేసారి ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్లగలుగుతాడు.

కార్మికులు ప్రత్యేక సాధనాలతో, నిచ్చెనల సాయంతో లోపల ప్రవేశించి అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడతారు.