గుంటూరులో పించన్లు పంపిణీ చేసిన కలెక్టర్

అక్షర ఉదయమ్ – గుంటూరు
ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ శుక్రవారం గుంటూరు పట్టణంలో పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయని ఆరా తీసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు రూ.110.50 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను ఎంతో ప్రాధాన్యతతో ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లాలో మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు 1,13,860, వితంతువులు 71,608, చేనేతకారులు 3,765, గీతకార్మికులు 443, మత్స్యకారులు 564, ఒంటరి మహిళలు 11,265, చర్మకారులు 866, హిజ్రాలు 67, హెచ్.ఐ.వి బాధితులు 2,580, కళాకారులు 74, డప్పు కళాకారులు 847, దివ్యాంగులు 24,493, వైద్య సంబంధిత పింఛనుదారులు 1,587, సైనిక సంక్షేమం 25, అభయహస్తం 3,932, అమరావతి భూముల సంబంధిత 17,413 పింఛన్లు పంపిణీ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

