అన్ని మున్సిపాల్టీల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
- స్వచ్చాంధ్ర ప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు
- ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తాం
- గత ప్రభుత్వం సింగపూర్ కు సీఐడి అధికారులను పంపి కేసులు పెట్టించారు
- గత ప్రభుత్వం ఒప్పందాలు రద్దు చేయడమే కాకుండా, సీఐడీ అధికారులను విచారణకు పంపించింది
- గత ప్రభుత్వంలో దెబ్బ తిన్న సంబంధాలను సరి చేసేందుకు సీఎం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడారు
- అమరావతి నిర్మాణంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకు వచ్చింది
- మీడియా సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

అక్షర ఉదయమ్ – విజయవాడ
ఈ ఏడాది చివరకల్లా రాష్ట్రాన్ని లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిపోయిన చెత్తతో పాటు కొత్తగా వచ్చిన 20 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామన్నారు.
రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు కమిషనర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్వచ్చ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో IEC, కెపాసిటీ బిల్డింగ్ పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త రహిత నగరాలుగా మార్చేందుకు మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలి. స్వచ్చ భారత్ కింద స్వచ్చాంధ్ర సాధనకు అధికారులు,ప్రజలంతా కలిసి పని చేయాలి. ప్రతి నెలా మూడో శనివారం సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదో ఒక ప్రాంతంలో స్వయంగా పాల్గొంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్చాంధ్ర సాధనకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారి సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్వచ్చతా నాలెడ్జ్ పార్టనర్స్ తో కలిసి మున్సిపల్ కమిషనర్లు చర్చించుకుని వాటిని కింది స్థాయిలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలోని 5 నగరాలకు స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వ కారణంగా ఉంది. అవార్డులు సొందిన మున్సిపాల్టీల అధికారులు, సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందన్నారు మంత్రి నారాయణ. ఈ చెత్తనంతా వచ్చే అక్టోబర్ రెండో తేదీ నాటికి పూర్తిగా తొలగిస్తామని అన్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన 20 లక్షల టన్నుల చెత్తను కూడా డిసెంబర్ నాటికి పూర్తిగా తొలగించి లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రోజూ వచ్చే ఘన వ్యర్ధాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలిస్తున్నాం అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో పాటు కొత్తగా కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతిలో కూడా ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాంట్లన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రం డంపింగ్ యార్డ్ రహితంగా మారుతుందని అన్నారు. అలాగే ద్రవ వ్యర్ధాల నిర్వహణ కోసం సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు రెండేళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. అమృత్ పథకం నిధులతో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు పూర్తి చేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ కు ఏపీకి మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి : నారాయణ

2014-19 మధ్య కాలంలో సింగపూర్ లోని మెజారిటీ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నామని, గత ప్రభుత్వం ఆ అగ్రిమెంట్ ను రద్దు చేయడంతో పాటు సీఐడీ అధికారులను పంపి విచారణ జరిపించారని అన్నారు. దీంతో ఆ ప్రభుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలు దెబ్బ తిన్నాయన్న మంత్రి. తిరిగి ఆ సంబంధాలు పునరుద్దరించ డానికే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని అన్నారు. సింగపూర్ ప్రభుత్వాధికారులు ఎంతో పాజిటివ్ గా స్పందించారని అన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే ప్రపంచ బ్యాంకుతో కలిసి అమరావతికి సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అలాగే సింగపూర్ కంపెనీలను విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించినట్లు తెలిపారు. తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో సీఆర్డీఏ కమిషనర్ అధికారికంగా లెటర్ రాసిన తర్వాత సంప్రదింపులు చేస్తారని మంత్రి నారాయణ అన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..