“ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు.. స్వదేశీ, స్వభాషా, స్వభూష”

ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు.. స్వదేశీ, స్వభాషా, స్వభూష

 

  • ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించి వికసిత్ భారత్ సాధనలో పునరంకితం అవుదాం
  • రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్

 

 


అక్షర ఉదయమ్ – అనంతపురం

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖా మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

శనివారం అనంతపురం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో “ఆత్మనిర్భర్ భారత్” అంశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్‌ విశిష్ట ఉపన్యాసం ఇచ్చారు. తన ప్రసంగంలో ఆయన “ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు స్వదేశీ, స్వభాషా, స్వభూష” అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ మూడు అంశాల ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తల్లి భాషపై గర్వం కలిగి ఉండాలని, మన సంస్కృతి, వారసత్వాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు.

భారతదేశం చారిత్రాత్మకంగా స్వయం సమృద్ధి కలిగిన దేశమని, ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా నేడు నిలిచిందని ఆయన అన్నారు. అయితే, వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన తర్వాత మనం దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత భారత్ ప్రపంచంలోని మూడవ అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగుతుందని ఆయన అన్నారు.

కోవిడ్ సమయంలో భారత దేశం తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం భారత్ విఫలం అవుతుందని భావించిన వేళ, మనం స్వయం ఆధారంగా మాస్కులు, టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్‌ కూడా తయారు చేశామని, కోవిడ్ ముగిసే నాటికి మన దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించి, 100కు పైగా దేశాలకు, అందులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంకి కూడా వ్యాక్సిన్ పంపినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ “ఆత్మనిర్భర్ భారత్”ను కేవలం సిద్ధాంతంగా కాక, ఆచరణలో చూపించారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నుండి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” దిశగా అడుగులు వేసిందని, విశాఖపట్నంలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లతో AI సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వ విద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎస్.ఏ. కోరి మాట్లాడుతూ 2047 నాటికి భారత్‌ను పూర్తిగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తీర్చి దిద్దడమే దేశ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధానకి విశ్వ విద్యాలయ కొత్త క్యాంపస్ వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టర్లు ప్రథమ దశ నిర్మాణం, అకడమిక్, హాస్టల్, పరిపాలనా భవనాల వేగ వంతమైన పూర్తి కోసం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

డీన్, రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) ఆచార్య సి. షీలారెడ్డి మంత్రికి, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. “ఆత్మనిర్భర్ భారత్” దేశాన్ని అభివృద్ధి భారత్‌గా మార్చే మార్గమని ఆమె అన్నారు.

కార్యక్రమం ముగింపులో డీన్ (విద్యార్థుల సంక్షేమం) ప్రొఫెసర్ జి. రాంరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంత్రి పేర్కొన్న మూడు స్తంభాలకు మరో స్తంభాన్ని జోడిస్తూ “స్వాభిమానమే ఆత్మనిర్భర్ భారత్‌కు నాలుగవ స్తంభం” అని అన్నారు. అనంతరం మంత్రి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నందలి డేటా సెంటర్ తదితర విభాగాలను సందర్శించారు.

అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ దేశమంతా స్వదేశీ నినాదం ఆత్మ నిర్భర్ భారత్ పై భారత ప్రధాని పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి, అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. దీని యొక్క ఆవశ్యకత పదే పదే మన భారత ప్రధాని తెలుపుతున్నారని, ఏ దేశమైన ప్రగతి సాధించాలంటే ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధార పడకుండా స్వదేశీయంగా మనమే తయారు చేసుకున్న ఉత్పత్తులను, టెక్నాలజీ, ఆవిష్కరణలు ఉత్పత్తులు చేయగలిగితే మన స్వదేశీ అవసరాలు తీరడమే కాకుండా ఎగుమతులను కూడా మనం చేసే అవకాశం ఉంటుంది అన్నారు. తద్వారా దేశ సంపద పెరుగుతుంది, సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతో పాటు సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరిగితే మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు, పరిశ్రమలు వచ్చే అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం లేని భారతావని సాధ్యం అవుతుందనీ, పేదరికం నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, సంస్కరణలు, నిర్ణయాల వల్ల దేశ అభివృద్ధి పథంలో నడుస్తోందనీ, ప్రపంచంలో 11వ స్థానంలో ఆర్థికంగా ఉన్న మన దేశం కొన్ని సంవత్సరాలలోనే ఆర్థిక ప్రగతి సాధించి నాలుగో స్థానానికి చేరిందనీ, 2030 నాటికి మూడవ స్థానానికి, 2047 సంవత్సరానికి మొదటి లేదా రెండవ స్థానానికి చేరుకుంటామని అనేక విదేశీ సంస్థలు, ఏజెన్సీలు అంచనాలు వేస్తున్నాయని తెలిపారు. మన దేశం ముందుకు అభివృద్ధి పథంలో సాగుతోందనీ, ఉత్కృష్టమైన సంస్కృతి, ఘనమైన వారసత్వ సంపద కలిగిన మన భారతదేశంలోనే ఉత్పత్తుల తయారీ చేపట్టి దిగుమతుల స్థాయి నుండి మన ఉత్పత్తులను ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రచారం చేయడం వలన, అవగాహన కల్పించడం వలన వాటిని ప్రమోట్ చేయడం జరుగుతోందని ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టి స్టార్ట్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అలాగే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి స్ధానికంగా ఉద్యోగ ఉపాధి కల్పించే దిశగా అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. మన ప్రధాన మంత్రి స్థానిక ఉత్పత్తులను పెంచడం ద్వారా స్థానికంగా వస్తువులు తయారు చేసుకుని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఎగుమతుల ద్వారా సంపద సృష్టించే కార్యక్రమం జరుగుతుందనీ అన్నారు. అంతే కాకుండా స్వదేశీ నినాదంతో 111 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనకు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హై వే నిర్మాణాలు, విమానాశ్రయాలు, పోర్టులు నిర్మించడం జరుగుతోందని అన్నారు. స్వదేశీ టెక్నాలజీతో మనం హెలికాప్టర్లను, స్వదేశీ విమాన ఇంజన్ల తయారీ చేసుకో గలుగుతున్నాం, అంతే కాకుండా చందమామ దక్షిణ ధృవం చేరుకుని చరిత్ర సృష్టించామని, డిఫెన్స్ పరికరాల తయారీ చేసుకో గలుగుతున్నామని, అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతున్నాం, తద్వారా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా స్వదేశీ నినాదం ఎంతగానో స్వతంత్ర భారతావని సాధనకు ఒక ముఖ్య కారణమైందని, ఉత్కృష్టమైనటువంటి నిర్మాణాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అలాంటి స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ కు మనం అందరం పునరంకితమై విస్తృతంగా ప్రచారం చేసి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించి స్వదేశీ వస్తువుల తయారీ చేయడంలో, దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుదామని మంత్రి పిలుపునిచ్చారు.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.