ఫలించిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ప్రయత్నం
- సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్ళలో ఆగనున్న ఎంప్లాయీస్ ట్రైన్
- సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్ళలో ‘ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్’ (12796/12795) స్టాపేజ్ అమలు
- ఉత్తర్వులు జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే
- అక్షర ఉదయమ్ – పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా ప్రజలు, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థుల దశాబ్దాల నాటి నిరీక్షణకు అధికారికంగా తెరపడింది. లింగంపల్లి – విజయవాడ – లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (ఎంప్లాయిస్ ట్రైన్.. 12795 / 12796) రైలుకు పిడుగురాళ్ళ స్టేషన్లో స్టాపేజ్ కు రైల్వే శాఖ ఆమోదం లభించింది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ రైలు పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది.

రైలు నిలిచే సమయం (04-09-2026 నుండి)
ట్రైన్ నెం. 12796 (లింగంపల్లి ➔ విజయవాడ) :
లింగంపల్లిలో ఉదయం 04:40కి బయలుదేరి, ఉదయం 08:06 గంటలకు పిడుగురాళ్ళ చేరుకుని 08:07 గంటలకు బయలు దేరుతుంది. విజయవాడ చేరుకునే సమయం ఉదయం 10:35.
ట్రైన్ నెం. 12795 (విజయవాడ ➔ లింగంపల్లి) :
విజయవాడలో సాయంత్రం 5:30 గంటలకు బయలు దేరి, రాత్రి 7:08 గంటలకు పిడుగురాళ్ళ చేరుకుని 19:09 గంటలకు బయలు దేరుతుంది. లింగంపల్లి చేరుకునే సమయం రాత్రి 23:35.
- పల్నాడు ప్రజలకు ఉపశమనం
లింగంపల్లి – విజయవాడ మధ్య నడిచే ఈ ‘ఎంప్లాయీస్ ట్రైన్’ పిడుగురాళ్ళలో ఆగడం వల్ల నిత్యం విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే వందలాది మంది ఉద్యోగులకు, పై చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు, వ్యాపారస్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పిడుగురాళ్ళలో స్టాపేజ్ లేనందున ఇబ్బందులు పడిన పల్నాడు పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ విన్నపాన్ని మన్నించి పిడుగురాళ్ళలో స్టాపేజ్ కు అనుమతించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి, ఇతర రైల్వే అధికారులకు, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు.
హర్షం వ్యక్తం చేసిన రైల్వే బోర్డు మెంబర్ కొంకా రాధా
- అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల రైలు బండి సెప్టెంబర్ 4వ తారీకు నుంచి పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ మలో నిలిపేందుకు సర్వం సిద్ధం కావడంపై పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామానికి చెందిన రైల్వే బోర్డు మెంబర్ కొంకా రాధా శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

ఉద్యోగులు, స్థానిక ప్రజల సౌకర్యాల దృష్ట్యా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో నాల్గవ తేదీ నుంచి పిడుగురాళ్ళలో ఉద్యోగులు రైలు స్టాపేజ్ మంజూరు అయిందని ధన్యవాదాలు తెలిపారు.