ఒక్క క్లిక్ తో మీ బ్యాంకు ఖాతా ఖాళీ..!
– జాగ్రత్తలు పాటించండి
– ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా

అక్షర ఉదయమ్ – మంగళగిరి
డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల కూడా వేగంగా పెరుగుతున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వ సాధారణంగా మారిందన్నారు.
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా ఖాతాలకు (ఉదా: వాట్సాప్, టెలిగ్రామ్ తదితర..) తెలియని మొబైల్ ఫోన్ నంబర్లు, గ్రూపుల నుండి APK (Android Package) (ఉదా: PM KISAN YOJANA no009.apk, ICICI Bank Credit Card Apply.apk, SBI ekyc.apk, YonoSBI.apk) ఫైల్స్ తరచుగా వస్తున్నాయన్నారు. కొన్ని APK ఫైల్స్ లో మాల్వేర్ (Malware), స్పైవేర్ (Spyware) లేదా ట్రోజన్ (Trojan) కోడ్లు ఉంటున్నాయని అన్నారు. యూజర్ తెలియకుండా APK (Android Package) ఫైల్స్ ను క్లిక్ చేసిన వెంటనే ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, పాస్వర్డ్స్, కాంటాక్ట్స్, మెసేజ్లు, గ్యాలరీ ఫైల్స్ వంటి వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలో పడతాయన్నారు. వాళ్ళు ఒకే ఒక్క క్లిక్ తో ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేయడంతో పాటుగా మొబైల్లో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగులకు దిగుతారన్నారు. మొబైల్ ఫోనులకు SMSల ద్వారా వచ్చే OTPలను కొన్ని యాప్లు చోరీ చేస్తున్నాయని తెలిపారు.
– వాస్తవ సంఘటన
ఇటీవల సత్యసాయి జిల్లా కనగానిపల్లి ప్రాంతానికి చెందిన ఒక రైతు వాట్సప్ కు కేంద్ర ప్రభుత్వ పథకం అయిన PM Kissan Yojana పేరుతో నకిలీ APK ఫైలు రాగా ఆ రైతు దానిని అధికారిక యాప్ గా భావించి డౌన్లోడ్ చేయడంతో ఆ రైతు యొక్క SBI బ్యాంకు ఖాతా నుండి 94,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేయడం జరిగిందన్నారు.
హానికరమైన APK ఫైలు యొక్క దశలవారీ పని తీరు
1. డౌన్లోడ్
ఇంటర్ నెట్ ద్వారా హానికరమైన యాప్ డౌన్లోడ్.
2. ఇన్స్టలేషన్
యాప్ ఇన్స్టలేషన్.
3. యాక్టివేషన్
యాప్ను ఇన్స్టలేషన్ చేసిన వెంటనే యాక్టివేషన్ ప్రక్రియ ప్రారంభమై, యాప్లో దాగి ఉన్న వైరస్ లేదా హానికర కోడ్ పని చేయడం మొదలు అవుతుంది.
4. సమాచారం దొంగతనం
బ్యాంకింగ్ సమాచారం (లాగిన్ వివరాలు, ఖాతా నంబర్లు), వ్యక్తిగత వివరాలు
(పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆధార్), కీ లాగింగ్ (టైప్ చేసిన మాటలు/పాస్వర్డ్లు), OTPలు ఉన్న SMS సందేశాలు సైబర్ నేరగాళ్లు కాజేస్తారు.
5. మోసాలు, దొంగతనం
చోరీ చేసిన డేటా ఆధారంగా అక్రమ లావాదేవీలు, మన పేరుతో బ్యాంకు ఖాతాలు తెరవడం, లోన్లు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగులు.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. ప్రమాదకర APK ఫైల్స్ ను డౌన్లోడ్ చేయవద్దు.
2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలి.
3. యాప్ అనుమతులను పూర్తిగా పరిశీలించడం. ఒక యాప్కు అవసరం లేని పర్మిషన్లు (ఉదా: క్యాలిక్యులెటర్ యాప్ కెమెరా అనుమతులు కోరడం) ఉంటే ఆ యాప్లను ఇన్స్టాల్ చేయవద్దు.
4. గూగుల్ ప్లే ప్రొటెక్షన్ను Play Store → Play Protect → Settings → “Scan apps with Play Protect” ను ఆన్ చేసి ఉంచండి.
5. ఆధునిక యాంటీ వైరస్/మొబైల్ సెక్యూరిటీ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవడం. Avast, Norton, Bitdefender వంటి నమ్మదగిన యాంటీ వైరస్ యాప్లను తమ మొబైల్లో ఇన్ స్టాల్ చేసుకోవడం.
6. బ్యాంకింగ్ యాప్లు ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అధికారిక బ్యాంకింగ్ యాప్ లతో మాత్రమే లావాదేవీలు జరపడం.
ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండి, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండటం, అపరచితుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కు స్పందించకుండా ఉండటం, బ్యాంకింగ్ లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తేనే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు.
ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవలసిందిగా డీజీపీ కోరారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..