త్వరలోనే అక్రెడిటేషన్ల జీవో – మంత్రి కొలుసు పార్థసారథి హామీ

– మంత్రితో ఏపీయుడబ్ల్యుజే భేటీ

 

అక్షర ఉదయమ్ – విజయవాడ:

అక్రెడిటేషన్ల జీవోపై కసరత్తు పూర్తయ్యిందని, త్వరలోనే జీవో విడుదల చేసి సకాలంలోనే అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు.

 

బుధవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఏపీయుడబ్ల్యుజే ప్రతినిధి బృందానికి మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చారు.

మంత్రిని కలిసిన బృందంలో ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.సురేష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

 

అక్రెడిటేషన్ల సంఖ్యను కుదించడం కోసం గత ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనలను తొలగించి , అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు దక్కేటట్లు చూడాలని యూనియన్ నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో అక్రెడిటేషన్ కమిటీలకు గతంలో ఉన్న విచక్షణాధికారాలను పునరుద్ధరించాలని, అక్రెడిటేషన్ల జీవో విడుదలలో జాప్యం లేకుండా చూడాలని , ఏపీయుడబ్ల్యూజే ప్రతినిధి బృందం కోరింది.

మంత్రి కొలుసు పార్థసారధి యూనియన్ నాయకుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. జీవోపై కసరత్తు పూర్తయ్యిందని, త్వరలోనే జీవో విడుదల అవుతుందని, అర్హులందరికీ అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ జి.అనితతో కూడా యూనియన్ నాయకులు భేటీ అయ్యారు.