రేషన్ బండ్ల కష్టాలకు చెక్ – మంత్రి నాదెండ్ల ప్రయత్నం

రేషన్ బండ్ల కష్టాలకు చెక్
– మంత్రి నాదెండ్ల ప్రయత్నం

 


అక్షర ఉదయమ్ – అమరావతి

రేషన్ బియ్యాన్ని ఇంటికి తెచ్చిస్తామంటూ వందల కోట్లు పెట్టి బండ్లు కొని అసలు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. లబ్దిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకునే వారని, కానీ ఈ బండ్లు పెట్టిన తర్వాత వారు ఎప్పుడు వస్తే అప్పుడు సందు చివరికో వాళ్లు బండి పెట్టిన ప్రాంతానికో పరుగెత్తుకుంటూ వెళ్లాల్సి వస్తుందని అన్నారు. రేషన్ దుకాణమే కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉంటుందని చెప్పారు.

ఈ ఎండీయూ వాహనాల వల్ల అటు ఆ వాహనాలు పెట్టుకున్న వారికి ఉపయోగం లేదని ఇటు లబ్దిదారులకు కష్టాలు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు అని తెలిపారు. దీని వల్ల వందల కోట్ల ధనం దుర్వినియోగం అయిందని, ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై తాము చాలా పరిశీలనలు జరిపామని, లబ్దిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నామని వెల్లడించారు. ఈ ఎండీయూ వాహనాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, రేషన్ దుకాణాల్లోనే తీసుకుంటామని అత్యధిక మంది లబ్దిదారులు చెప్పారని తెలియజేశారు.

అలాగే ఈ వాహనాల ఈఎంఐలకూ ప్రభుత్వం ఇచ్చే కమిషన్ కు పొంతన లేదని, ఆదాయం సరిపోవడం లేదని వాహన యజమానులు కూడా చెబుతున్నారని తెలిపారు. దీంతో వారికీ ఓ పరిష్కారాన్ని చూపించాల్సి ఉందన్నారు. ఇక రేషన్ దుకాణదారులు కూడా పాత పద్దతిలో సేవలు చేయడానికి తాము సిద్ధమేనని అంటున్నారని, అనారోగ్యంతో ఉన్న వారికి.. రాలేని వాళ్లకు డోర్ డెలివరీకీ వారు ముందుకు వస్తున్నారని చెప్పారు. అన్నీ పరిశీలించి నేడో రేపో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..