
అక్షర ఉదయమ్ – అమరావతి
రాష్ట్రంలో సులభతర వాణిజ్యం, కంప్లెయన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం, కంప్లెయెన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సిఎస్, కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ కు చెందిన రాష్ట్రానికి నోడలు అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందన గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్దఎత్తున సంస్కరణలు ప్రవేశ పెటడ్డం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు వేగవతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేగాక సులభతర వాణిజ్యం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకుని వచ్చేందుకు కృషి జరుగుతోందని వివరించారు. ఉత్తమ విధానాలను అవలంభించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానిక కృషి జరుగుతోందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.
అంతకు ముందు కేంద్ర కేబినెట్ సెక్రటేరియెట్ సెక్రటరీ కోఆర్డినేషన్, రాష్ట్రానికి నోడలు అధికారిగా ఉన్న వందన గుర్నాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సులభతర వాణిజ్యం మరియు కంప్లెయెన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో 18 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రత్యేక టాస్క్పు ఫోర్సు కమిటీ జాతీయ స్థాయిలో పని చేస్తోందని తెలిపారు. అలాగే రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ పని చేస్తోందని అన్నారు. ఏపీలో సుమారు 23 రంగాల్లో మొదటి దశలో పలు కీలక అంశాల్లో ఇప్పటికే చేపట్టిన సంస్కరణలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివరించారు. ముఖ్యంగా సులభతర వాణిజ్యం, కంప్లెయెన్స్ రిడక్షన్ కు సంబంధించిన పలు చట్టాలు, సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్స్, మాస్టర్ ప్లాన్లు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో తగిన మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ మాట్లాడుతూ వికసిత్ ఎపి 2047లో భాగంగా ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్దం చేసి అమలు చేస్తోందని తెలిపారు. 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు చెప్పారు. అంతేగాక 2030 నాటికి ఎంఎస్ఎంఇ రంగాన్ని పెద్ద ఎత్తున పోత్సహించడం ద్వారా ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రెన్సూర్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ పలు సంస్కరణలు తీసుకుని రావడంలో ఏపీ దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలుండగా వాటి పరిధిలో 21 అర్బన్ డెవల్మెంట్ అధారిటీల ద్వారా భవన నిర్మాణ అనుమతులను జారీ చేయడం జరుగుతోందని అన్నారు. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ మాట్లాడుతూ వివిధ లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులను ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తున్నట్టు చెప్పారు. పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్థి పన్నును ఆన్లైన్ విధానంలో వసూలు చేసేందుకు చర్యలు చేపట్టామని ఇప్పటికే 80 లక్షల డిమాండ్లను డిజిటలైజ్ చేయడం జరిగిందని వివరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ వివిధ మద్యం దుకాణాల లైసెన్లు లాటరీ విధానంలో జారీ చేయడం జరుగుతోందని తెలిపారు. బార్ లైసెన్సులను ఆన్లైన్ లో జారీ చేస్తున్నట్టు వివరించారు. ఇంకా పలు శాఖల కార్యదర్శులు వారి వారి శాఖలకు సంబంధించి సులభతర వాణిజ్యం, కంప్లెయెన్స్ రిడక్షన్ కు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా, యం.టి కృష్ణబాబు, జి.సాయి ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు కుమార్ విశ్వజిత్, కాంతిలాల్ దండే, కార్యదర్శులు ప్రతిభా దేవి, చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్సెస్ బాబు ఎ, సౌరవ్ గౌర్, ఎండి ఏపిఐఐసి అభిషిక్త్ కిషోర్, కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ శ్వాతి మహంతి, డిపిఐఐటి డిప్యూటి సెక్రటరీ యశస్వి ముడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.