బడుగుల ప్రాధాన్యతకు నిదర్శనమే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక : గురజాల ఎమ్మెల్యే యరపతినేని
– బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మకు శుభాకాంక్షలు తెలిపిన యరపతినేని
అక్షర ఉదయమ్ – అమరావతి

తెలుగుదేశం పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పార్టీకి 3 స్థానాలకు అవకాశం వస్తే రెండింటిని బీసీ నాయకులకే ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆది నుంచి బీసీలపై చూపే ఆదరాభిమానాలు, కల్పించే అవకాశాలకు మరో ఉదాహరణగా యరపతినేని పేర్కొన్నారు. ఏపీ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం దక్కించుకున్న
బీసీ నాయకులు బీటీ నాయుడు, బీద రవిచంద్రలను సోమవారం యరపతినేని శ్రీనివాసరావు కలసి అభినందించారు. ఎస్సీ కోటాలో అవకాశం దక్కించుకున్న కావలి గ్రీష్మకు కూడా శుభాభినందనలు తెలియజేశారు. వారి నామినేషన్ల కార్యక్రమం సందర్భంగా యరపతినేని వారిని ప్రత్యేకంగా కలసి హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యరపతినేని ఎంతో కాలంగా పార్టీలో ఉంటూ, కష్ట కాలంలో సేవలు అందించిన వారి శ్రమకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల రూపంలో ప్రతిఫలం దక్కినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తోందని అన్నారు. ఏ అవకాశం వచ్చినా దళిత, బహుజనులకు అవకాశాలివ్వడం ద్వారా తెలుగుదేశం అంటే శ్రమజీవుల పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు.