నాయకత్వంలో కొత్త ఆలోచన.. పాలనలో సరికొత్త వేగం
- న్యూ ఏజ్ గవర్నెన్స్తో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన
- 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

అక్షర ఉదయమ్ – అమరావతి
నాయకత్వంలో కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్ – న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాము లీడర్షిప్ ట్రాన్సిషన్లో ఉన్నామని, న్యూ లీడర్షిప్ అప్రోచ్తో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నాయకత్వం అనేది సెల్ఫ్ మోటివేషన్తో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థంగా వినియోగించు కోవాలని సీఎం సూచించారు. ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని, ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. టెక్నాలజీ యుగంలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియగా మారిందని, నైపుణ్యానికి ఎంత పదును పెడితే అంత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు.
- ప్రపంచంలోనే అత్యుత్తమంగా భారతీయ ఎంట్రప్రెన్యూర్స్

మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం గత కాలపు నినాదమని, ఇప్పుడు ఆ తేడా లేదని సీఎం చంద్రబాబు అన్నారు. బ్యూరోక్రసీకి, రాజకీయ నేతలకు వేర్వేరు నైపుణ్యాలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ప్రతి నాయకుడూ తన బృందాన్ని ఎంత ప్రభావ వంతంగా నిర్మిస్తారన్నదే ఫలితాలను నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రతి రంగంలోనూ సంతృప్తి అనేదే ముఖ్యమని అన్నారు. ప్రపంచంలోనే భారతీయ ఎంట్రప్రెన్యూర్స్ అత్యుత్తమంగా ఉన్నారని, ప్రతిష్ఠాత్మక కంపెనీలకు వారే సారథ్యం వహిస్తున్నారని సీఎం చెప్పారు. ఏ వ్యవస్థలో అయినా ఇమిడిపోయే తత్వం భారతీయులదని, దానికి అనుగుణంగా మనం కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగ వ్యవస్థలే మారిపోతున్నాయని, అంతిమంగా క్రెడిబిలిటీ అనేదే కీలకమని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తమను తాము మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో చాలా అంశాలపై దృష్టి పెట్టామని, ఇప్పుడు నాయకత్వంపైనే ఆలోచన చేయాలని నిర్ణయించామని తెలిపారు. నూతన నాయకత్వ విధానంతో పని చేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని సీఎం అన్నారు.