ఇస్రో వందో రాకెట్ ప్రయోగం విజయవంతం

– నింగిలోకి దూసుకుపోయిన జి.ఎస్.ఎల్.వి – ఎఫ్ 15 

అక్షర ఉదయమ్ – శ్రీహరికోట: ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌ రాకెట్ లాంచ్ స్టేషన్ నుంచి జి.ఎస్.ఎల్.వి – ఎఫ్ 15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.

ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. ఇది కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్‌ పరికరాల్లో లోకేషన్‌ ఆధారిత సేవలందించనుంది.