ఫేక్ ట్రేడింగ్ యాప్తో రిటైర్డ్ ఉన్నతాధికారికి వల
– రూ.6.8 కోట్ల టోకరా.. ముగ్గురు అరెస్ట్
– నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్తో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారికి మోసం
– బాధితుడు కృష్ణన్ కుమార్ కౌశల్ రూ.6.8 కోట్లు నష్టపోయిన వైనం
– కేరళకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన చెన్నై పోలీసులు
– మోసగించిన డబ్బు హవాలా, క్రిప్టో ద్వారా విదేశాలకు తరలింపు
– ఇదే కేసులో గతంలో ఢిల్లీ ప్రాంతంలో ఐదుగురి అరెస్టు

ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి.
ఇటీవల నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్ను నమ్మిన తమిళనాడుకు చెందిన ఒక రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ఏకంగా రూ.6.8 కోట్లు పోగొట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి గ్రేటర్ చెన్నై పోలీసులు కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్కు చెందిన కృష్ణన్ కుమార్ కౌశల్ (60), 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి.

ఆయన తమిళనాడు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా జులై 2024 లో పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన జీవితాంతం సంపాదించిన డబ్బు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇంటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును నకిలీ పెట్టుబడి యాప్ల ద్వారా మోసపోయానని తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం కృష్ణన్ కుమార్కు డిసెంబర్ 2024 లో వాట్సాప్ ద్వారా కొన్ని సందేశాలు అందాయి.
వాటి ద్వారా ‘ఎస్ఎంసీ అపెక్స్’, ‘శాండా క్యాపిటల్’ అనే రెండు నకిలీ పెట్టుబడి యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్లుగా పరిచయం చేసుకున్న మోసగాళ్లు, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు.
దీంతో జనవరి 2025 మొదటి వారం నుంచి నెలాఖరు లోగా సుమారు రూ.6.58 కోట్లను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.

అయితే యాప్లో షేర్ల విలువ రోజూ పెరుగుతున్నట్లు చూపించినా, అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) గణాంకాలతో పోల్చి చూసినప్పుడు తేడాలు కనిపించడంతో కృష్ణన్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు.
“యాప్లో చూపిన షేర్ల విలువ రోజూ పెరిగేది, కానీ అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటాతో సరి చూస్తే ఆ విలువలు సరిపోల లేదు” అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోస పోయానని గ్రహించిన ఆయన, జాతీయ సైబర్క్రైమ్ హెల్ప్లైన్ (1930) కు ఫిర్యాదు చేసి, చెన్నై పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ను ఆశ్రయించారు.
ఇన్స్పెక్టర్ పీర్ బాషా నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి, మోసపూరిత బ్యాంకు ఖాతాల ఆధారంగా కేరళలో నిందితులను గుర్తించింది.
ఎర్నాకులంకు చెందిన శ్రీజిత్ ఆర్.నాయర్ (47), కోజికోడ్కు చెందిన అబ్దుల్సాలు (47), మలప్పురంకు చెందిన మహమ్మద్ ఫర్వాయిజ్ (44) లను అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్పై చెన్నైకి తరలించి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఈ ముగ్గురూ సైబర్ నేరగాళ్ల తరపున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మోసగించిన డబ్బును హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించి, ఆపై బినాన్స్ ట్రేడింగ్ యాప్ ద్వారా యూఎస్డీటీ క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు పోలీసులు కనుగొన్నారు.
ఈ కేసుకు సంబంధించి గతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురిని అరెస్టు చేసినప్పటికీ, కేరళకు చెందిన ఈ ముగ్గురూ డబ్బును క్రిప్టో లావాదేవీల ద్వారా మళ్లించడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.
“ఈ నిందితులు తమిళనాడులోని ఇతర ప్రాంతాలతో పాటు, వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి మోసాలకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నాం” అని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..