పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సిఎం చంద్రబాబు సీరియస్
- రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై ఆగ్రహం
- ఈ అరాచకాలు ఏంటి? మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా?
- దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి
- డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అక్షర ఉదయమ్ – అమరావతి
రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి ఈ అరాచకాలు ఏంటి? మహిళలపై, పోలీసులపై రాళ్లు వేస్తారా? దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పొగాకు రైతులకు గిట్టుబాట ధర విషయంలో పరామర్శ పేరుతో జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైసీపీ శ్రేణులు దాడులకు దిగడంపై సిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతుల పరామర్శకు వెళితే జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు? వెళ్లింది రైతుల కోసమా..? దాడుల కోసమా..? నా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు. ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే, దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా? దుర్వినియోగం చేస్తారా? జగన్ పర్యటనలు చూస్తుంటే, తన ఉద్దేశం రైతుల సమస్యలు కాదు, అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమే అని అర్ధం అవుతుంది. రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదు’ అని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్య ఉంటే నిరసనలు తెలపడానికి, పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదు. అయితే ప్రతి పర్యటనలో వాళ్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతర కరంగా ఉంది అని సిఎం అన్నారు. శాంతి భద్రతల సమస్య సృష్టించి, రాళ్ల దాడి చేసి, పోలీసులతో పాటు, పలువురు గాయ పడడానికి కారణం అయిన వారిపై చట్ట పరమైన చర్యలకు ఆదేశించారు. వాళ్లు ఎక్కడికి వెళ్లాలి అంటే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాం. అలా అని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తాను అంటే మాత్రం సహించేది లేదు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని సిఎం ఆదేశించారు.
ఆత్మగౌరవంపై దెబ్బకొట్టి కనీసం క్షమాపణ చెప్పరా?
‘జగన్ సొంత ఛానల్ లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. ఆ వికృత వ్యాఖ్యలను, ప్రచారాన్ని అన్ని వర్గాలు ఖండించాయి. అయితే జగన్ మాత్రం ఇప్పటికీ వాటికి క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నాయకులుగా చలామణి అవుతానంటే ఎలా? ప్రజలు ఎలా అంగీకరిస్తారు? ఆడబిడ్డలు ఆవేదనతో నిరసన చేస్తే వారిపై దాడులు చేస్తారా?’ అని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..