అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
- సచివాలయంలో మంత్రి నారాయణతో భేటీ అయిన మలేషియా ప్రతినిధులు
- సమావేశంలో పాల్గొన్న మలేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గనబతిరావ్, మలేషియా – ఆంధ్రా బిజినెస్ చాంబర్ ప్రతినిధులు
- అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి వివరించిన మంత్రి నారాయణ
- రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి
- రాబోయే 5 ఏళ్లలో 6000 నుంచి 10000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా పలు ప్రాజెక్టులను మంత్రి నారాయణకు వివరించిన మలేషియా ప్రతినిధులు

అక్షర ఉదయమ్ – అమరావతి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి మలేషియా బృందం అక్కడి మంత్రి, ఎంపీతో కలిసి అమరావతిలో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా మలేషియా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆ తర్వాత సచివాలయంలో వారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మలేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గనబతిరావ్, మలేషియా – ఆంధ్రా బిజినెస్ చాంబర్ ప్రతినిధులు, పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి అభివృద్దికి భారత్ తో కలిసి పని చేస్తామని మలేషియా మంత్రి పప్పారాయుడు తెలిపారు.
ముఖ్యంగా మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామిక వేత్తలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణకు వివరించారు. ప్రధానంగా ఐదు కీలక సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఎడ్యుకేషన్, టూరిజం – హాస్పిటాలిటీ, ట్రేడ్ అండ్ కామర్స్, రియల్ ఎస్టేట్ (టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, అభివృద్ది, మౌళిక వసతులు కల్పన), తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. అమరావతిలో మెడికల్ యూనివర్శిటీ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్ జయ యూనివర్శిటీ ముందుకొచ్చింది. అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు బెర్జయ గ్రూప్ ముందుకొచ్చింది.

ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి : మంత్రి నారాయణ
అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధులకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికా బద్దంగా అమరావతి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 51 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయి, పనులు కూడా ప్రారంభం అయ్యాయని, నిర్ధేశిత గడువులతో నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. కేపిటల్ సిటీలో 360 కిమీ మేర ట్రంక్ రోడ్లు ఏడాదిన్నర లోగా, 1500 కిమీ మేర లే అవుట్ రోడ్లు రెండేళ్లలోగా, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు చెందిన 4000 ఇళ్లను వచ్చే మార్చి నెలాఖరు లోగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి అన్నారు . అలాగే పాలనా భవనాలైన సచివాలయం టవర్లు, అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను రెండున్నర ఏళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. గత మూడు నెలలుగా వర్షాల వల్ల పనులకు కొంత మేర ఆటంకం కలిగిందని, రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ మలేషియా బృందానికి వివరించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ పాల్గొన్నారు.